🅿️తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్.. వచ్చే 5 రోజులు మాడే పగిలే ఎండ, వడగాలులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతుంది. ఉదయం 9 గంటల నుంచే మాడు మంటెక్కించే ఎండలతో.. గడప దాటాలంటే జనం భయపడుతున్నారు. ప్రస్తుతానికి 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతుంటడంతో ముందు ముందు భానుడి ఉగ్రరూపం ఏస్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన దడ పుట్టిస్తోంది.

రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది వాతావరణ విభాగం. ఇవాళ్టి నుంచి 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాడ్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని సూచించింది ఐఎండీ. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

సాధారణం కంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయన్నారు అధికారులు. ఎండల తీవ్రతతో ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఏసీలు కూడా సరిపోనంత ఉక్కపోత రాబోతుంది బీ అలర్ట్ అంటోంది వాతావరణ శాఖ. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. అదే సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలకు కూడా క్రమంగా పెరుగుతూ ఉండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది రికార్డు స్థాయి ఎండలతో సమ్మర్ సీజన్ ప్రకంపనలు సృష్టించగా.. ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుందా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.