సిమ్లా: ఒక యువకుడు మొబైల్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ఎదురు నుంచి వేగంగా వచ్చిన కారు అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల నరేష్ కుమార్ ఒక హోటల్లో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పని తర్వాత నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
కాగా, మొబైల్ ఫోన్ చూడటంలో మునిగిపోయిన నరేష్, ఎదురుగా వచ్చే వాహనాలను గమనించలేదు. ఈ నేపథ్యంలో వేగంగా వచ్చిన ఒక కారు అతడ్ని బలంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డాడు. తీవ్రంగా గాయపడిన నరేష్ అక్కడికక్కడే చనిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మందరతండాలో నివాసముంటున్న కారు డ్రైవర్ రాకేష్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.